బుధవారమే డెడ్‌లైన్.. ఒప్పందం కుదరకుంటే మళ్లీ బాంబులే: ట్రంప్

  • డీల్ కుదరకుంటే మళ్లీ బాంబుల దాడులు తప్పవని హెచ్చరిక
  • ట్రంప్ వాదనలు పూర్తిగా అబద్ధమని కొట్టిపారేసిన ఇరాన్
  • యురేనియం నిల్వలను తరలించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. వచ్చే బుధవారం లోపు ఒప్పందం ఖరారు కాకపోతే ఇరాన్‌పై మళ్లీ బాంబు దాడులు ప్రారంభిస్తామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ట్రంప్ వాదనలను ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అవన్నీ అబద్ధాలని కొట్టిపారేసింది.

హమాస్, హిజ్బుల్లా వంటి సంస్థలకు నిధులు ఆపడానికి, అణు కార్యక్రమాన్ని నిరవధికంగా నిలిపివేయడానికి ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌లోని శుద్ధిచేసిన యురేనియం నిల్వలను కూడా అమెరికాకు తరలించడానికి ఒప్పుకుందని ఆయన ప్రకటించారు. ఒప్పందం పూర్తయ్యే వరకు ఇరాన్‌పై నావికాదళ దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు చెప్పిన ఏడు విషయాలూ అబద్ధాలేనని ఇరాన్ ప్రధాన రాయబారి మొహమ్మద్ ఘాలిబాఫ్ పేర్కొన్నారు. "శుద్ధిచేసిన యురేనియం మాకు ఇరాన్ గడ్డతో సమానం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకు తరలించే ప్రసక్తే లేదు" అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ మంగళవారంతో ముగియనుండగా, ట్రంప్ విధించిన బుధవారం గడువుతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తదుపరి చర్చలు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Donald Trump
Iran
USA
Uranium
Attack
Israel

More Telugu News